Themes from World History

Themes from World History

Thursday, July 23, 2020

"చిరాయువులు - ప్రాచీన రోమన్ చరిత్ర" - కొత్త పుస్తకం

బ్లాగర్లకి నమస్కారం.

రోమన్ సామ్రాజ్య చరిత్ర మీద మొదలెట్టిన ధారావాహిక అర్థాంతరంగా ఆగిపోవడం కొంతమందికి చిరాకు కలిగించవచ్చు.
బ్లాగ్ లో రాయకపోయిన రచన మాత్రం కొనసాగించాను. ఆ ప్రయత్నం పూర్తయ్యి ఈ మధ్యన పుస్తక రూపం దాల్చింది.

ఆ పుస్తకం పెరు "చిరాయువులు - ప్రాచీన రోమన్ చరిత్ర" . దీన్ని మంచి పుస్తక్రం ప్రచురణలు ముద్రించారు.

పుస్తకానికి ముందు మాట కింద ఇస్తున్నాను.




ముందుమాట

చిన్నప్పుడు బళ్లో చదువుకునేటప్పుడు చరిత్ర అంటేనే భయపడి పారిపోయే పిల్లల్లో నేనూ ఒక్కణ్ణి. ‘పానిపట్ యుద్ధం ఎప్పుడు జరిగెను?’, ‘అశోకుడు ఎప్పుడు పుట్టెను?’ వంటి నిరర్థక సమాచారాల సమాహారంలా కనిపించేది చరిత్ర. చదవాలంటే ఏవగింపు కలిగేది. మరో విషయం ఏమిటంటే చరిత్ర యొక్క ప్రాముఖ్యత అర్థం కావాలంటే కొంత జీవితానుభవం కావాలేమో. ఆ కారణం చేత కూడా ఆ రోజుల్లో చరిత్ర అంతగా మింగుడు పడకపోయి ఉండొచ్చు.
కాని గత కొన్నేళ్లుగా నెమ్మదిగా మనసు చరిత్ర మీదకు మళ్లింది. వృత్తిరీత్యా శాస్త్రరంగంలో ఉండడం చేత  సైన్స్ రచనలోకి ప్రవేశించాను. దశాబ్దం పైగా రంగంలో కృషి చేస్తూ  వస్తున్నాను. ఆ ప్రయత్నంలో సైన్స్ చరిత్ర మీద కూడా దృష్టి సారించాను. ఒక వైజ్ఞానిక రంగం గురించి చెప్పేటప్పుడు, వర్తమాన కాలంలో అందులో భావజాలం ఎలా వుందో వర్ణించడం ఒక పద్ధతి. సామాన్యంగా పాఠ్యపుస్తకాలు ఆ పద్ధతిని అనుసరిస్తాయి. కాని ఒక వైజ్ఞానిక రంగంలో ఆది నుండి భావాలు ఎలా పరిణతి చెందుతూ వచ్చాయో తెలుసుకున్నప్పుడు ఆ రంగాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోడానికి వీలవుతుంది.
వైజ్ఞానిక చరిత్ర గురించి చదువుతున్నప్పుడు భావ పరిణామ క్రమం తెలియడమే కాకుండా ఆ ఆవిష్కరణలు జరుగుతున్న కాలంలో సామాజిక నేపథ్యం గురించి కూడా తెలుస్తుంది.
        ‘ఖగోళశాస్త్ర చరిత్ర’ అనే పుస్తకం రాయడం కోసం చేసిన పరిశోధనలో  ఎన్నో విలువైన విషయాలు తెలుసుకున్నాను. ఉదాహరణకి గ్రహగతుల గురించి శోధించిన యోహానెస్ కెప్లర్ జీవితాంతం నిరుపేదగానే జీవించాడు. వివిధ క్రయిస్తవ మత వర్గాల మధ్య నిరంతరం ఘర్షణ చెలరేగే నేపథ్యంలో బిక్కుబిక్కు మంటూ, ఒక పక్క ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తూనే మరో పక్క తన అద్భుత వైజ్ఞానిక ఆవిష్కరణలు చేశాడు. ఈ రోజుల్లో చాలా మంది వైజ్ఞానిక రంగంలో సరైన ‘ఫండింగ్’ (ధనసహాయం) లేక ఉన్నత స్థాయిలో ఫలితాలు సాధించలేకపోతున్నామని వాపోతూ ఉంటారు. అలాంటి వాదనలు కేవలం కుంటిసాకులు మాత్రమేనని కెప్లర్ వంటి వారి జీవితాలు చూస్తే అర్థమవుతుంది.


 ‘ఖగోళశాస్త్ర చరిత్ర’ లో నాకు నిజంగా కనువిప్పు కలిగించిన మరి కొన్ని విషయాలు ఉన్నాయి. “ప్రాచీన లోకంలో ఖగోళ శాస్త్రం” అనే అధ్యాయంలో ప్రపంచంలో వివిధ ప్రాంతాలకి చెందిన ప్రాచీన సంస్కృతులలో ఖగోళవిజ్ఞానం ఏ స్థాయిలో ఉండేదో చర్చించడం జరిగింది. కొన్ని సహస్రాబ్దాల చరిత్ర గల భారతంలో కొన్ని వేల ఏళ్లుగా ఖగోళ విజ్ఞానం ఉందంటే ఆశ్చర్యం లేదు. కాని ప్రాచీన చైనా, ప్రాచీన అరేబియా, ప్రాచీన గ్రీకు, రోమన్, ఈజిప్షియన్ సంస్కృతులలో కూడా విస్తృతమైన ఖగోళవిజ్ఞానం ఉందని తెలిసి ఆశ్చర్యం కాలిగింది. అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన మరో విషయం. పసిఫిక్ మహాసముద్రంలో దక్షిణ భాగాన పాలినేషియా అనే ప్రాంతంలో కొన్ని వేల దివులు చెదురుమొదురుగా విస్తరించి వుంటాయి. అక్కడ కూడా కొన్ని వేల ఏళ్లుగా ఎంతో పరిణతి చెందిన ఖగోళ సాంప్రదాయం ఉందట! మరి ఒక దీవి నుండి మరో దివికి మహాసముద్రం మీద పయనించాలంటే కొండలు, నదులు వంటి కొండగుర్తులేవీ ఉండవు. కేవలం నక్షత్రాల బట్టి, గ్రహస్థానాల బట్టి దారి తెన్నులు తెలుసుకోవలసి ఉంటుంది. నక్షత్ర గ్రహ స్థానాల విజ్ఞానాన్ని వాళ్లు కవితల రూపంలో కూర్చి, మౌఖికంగా కొన్ని సహస్రాబ్దాలుగా పై తరం నుండి కింది తరాలకి చేరవేస్తూ వస్తున్నారు. అది విన్నప్పుడు మన చరిత్ర పట్ల, అన్య ప్రాంతాల చరిత్ర పట్ల అంతవరకు నాలో గూడుకట్టుకున్న భావజాలం అంతా పునాదుల వద్ద కదిలినట్టు అయ్యింది.

సమకాలీన ప్రపంచ రాజకీయ వేదిక మీద పెద్దగా పాత్ర వహించని పాలినేషియా వంటి ప్రాంతంలో కూడా ప్రాచీనవైజ్ఞానిక చరిత్ర ఉన్నప్పుడు మరి భూమి మీద ప్రాచీన చరిత్ర లేని ప్రాంతం ఏది? భారతీయ సంస్కృతి అతి ప్రాచీనమైన సంస్కృతి అని,  ఆ ప్రాచీనతే మన ప్రత్యేకత అని భారతీయులుగా మనం నమ్ముతాము. బళ్లో పాఠాల ద్వార, రాజకీయనాయకుల ప్రసంగాల ద్వార, బామ్మలు పసిపిల్లలకి చెప్పే కథల ద్వార ఆ సందేశాన్నే పరిపరి విధాల మనం వింటుంటాము. భారతీయ జీవన దృక్పథంలో ప్రాచీనత ఒక అత్యంత విలువైన లక్షణం. ఎంత ప్రాచీనమైతే అంత గొప్ప! ఆ కారణం చేతనే కాబోలు దక్షిణాదికి చెందిన భాషలు (తమిళం, కన్నడం, తెలుగు) హోరాహోరిగా పోరి ప్రాచీన భాష హోదాని గెలుచుకున్నాయి. 

అయితే ప్రాచీనత అనేది సాపేక్షమైన విలువ. ఒకటి ప్రాచీనం అనేటప్పుడు, దేని కన్నా ప్రాచీనం అన్న ప్రశ్న వస్తుంది. మనం ప్రాచీనులం అనుకున్నప్పుడు తక్కిన సంస్కృతులు అంత ప్రాచీనం కావు అని అనుకోవలసి వస్తుంది. అలాంటి ఆలోచనాధోరణి, అలాంటి విశ్వాసం మన సమాజంలో ఎంత లోతుగా పాతుకుపోయిందో కొట్టొచ్చినట్టు చెప్పే ఒక అనుభవం నా మీద గాఢమైన ముద్ర వేసింది.

2017 లో చెన్నై జల్లికట్టు ఉద్యమం జరిగింది. తమిళుల సాంప్రదాయక క్రీడ అయిన జల్లికట్టుని సుప్రీమ్ కోర్టు నిషేధించిన నేపథ్యంలో ఆ నిర్ణయానికి నిరసన తెలియజేస్తూ లక్షలాది మంది మెరీనాలో పోగై ఉద్యమించారు. ఆ సందర్భంలో సి.ఎన్.ఎన్. టీవీ చానెల్ రిపోర్టర్ జక్కా జేకబ్ అక్కడి వారిని ఇంటర్య్వూ చేస్తూ “ఈ ఉద్యమం ఎందుకు చేస్తున్నారు?” అని అడిగాడు. అప్పుడు ఉద్యమకారులలో ఒక వ్యక్తి జేకబ్ మైకు లాక్కుంటూ అన్నాడు “రెండు వేల ఏళ్ల క్రితం, తక్కిన ప్రపంచం అంతా అనాగరికంగా, నగ్నంగా అడవులు పట్టి తిరుగుతున్న సమయంలో కూడా ఇక్కడ గొప్ప నాగరికత విలసిల్లేది. అలాంటి నాగరికతను అణచివేస్తున్నందుకు నిరసిస్తున్నాం…”
పైన మాట్లాడిన వ్యక్తి ఆ ప్రాచీనతను భారతీయులు అందరికీ ఆపాదిస్తున్నాడా, కేవలం మరి తమిళులకే ఆపాదిస్తున్నాడా అన్నది స్పష్టంగా లేదు. ఏదేమైనా అతడి మాట్లల్లో పైన చెప్పుకున్న భావమే ధ్వనిస్తోంది – “మనది ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైన  సంస్కృతి. మనకున్నంత గొప్ప నాగరికత మరెక్కడా లేదు.”

 పైన ఆ విప్లవకారుడు అన్న మాటలు పూర్తిగా వాస్తవ విరుద్ధం అనడానికి పెద్దగా చరిత్ర తెలియనక్కర్లేదు. రెండు వేల ఏళ్ల క్రితం, అంటే క్రీశ 0 అనుకుంటే, అప్పటికే రోమన్ సామ్రాజ్యం ఏడు శతాబ్దాల చరిత్రని చూసింది. రోమన్లకి ముందు ఎట్రుస్కన్లు, వారికి ముందు గ్రీకులు, ఇంకా వెనక్కు క్రీపూ మూడు నాలుగు వేల ఏళ్లు వెనక్కి పోతే అసీరియన్లు, మెసొపొటేమియన్లు, ఇంకా వెనక్కు పోతే ఈజిప్షియన్లు… అన్నిటి కన్నా ప్రాచీన నాగరికత ఏది అన్న ప్రశ్నకి సమాధానం తేల్చుకోడానికి మన అజ్ఞానమే అవరోధం అనిపిస్తుంది.

మరి అజ్ఞానం తొలగాలంటే ఆధారాలు కావాలి. అంటే వస్తుగత దృష్టితో శాస్త్రీయంగా శోధిస్తూ ఆధారాలు రాబట్టాలి. కాని మన దేశంలో వస్తుగత దృష్టి, శాస్త్రీయత, హేతువుతో కూడుకున్న వివేచన మొదలైన పదజాలానికి ఆదరణ తక్కువ. నమ్మకాలు, భావావేశాలు ఇవే మన జీవితాలని నడిపించే అధిష్టాన దేవతలు. కేవలం గుడ్డి నమ్మకం మీద, భావావేశం మీద నడిచే జీవన గతి కల్లోలమయంగా ఉంటుంది. వస్తుగత దృష్టి, శాస్త్రీయత అనే శక్తులు ఆ గతికి పటుత్వాన్ని, స్థిరతని ఇస్తాయి. వ్యక్తి విషయంలోనే కాక, సమిష్టి విషయంలో కూడా ఆ సూత్రమే వర్తిస్తుంది.

కాబట్టి భారతీయులుగా మనకి మన సమాజం గురించి, మన గతం గురించి, మన ప్రాచీనత గురించి సరైన అవగాహన కలగాలంటే, తక్కిన ప్రపంచం గురించి, ఇతర జాతుల గతాన్ని గురించి, అంతో ఇంతో అవగాహనని పెంపొందించుకోవాలి. తక్కిన ప్రపంచం గురించి మరింత లోతుగా తెలిసినప్పుడు బావిలో కప్పలాంటి మన దుస్థితి నుండి బయటపడ గలుగుతాము. కాబట్టి తక్కిన ప్రపంచం గురించి అవగాహనని అందించే సాహిత్యాన్ని సృష్టించాలి.

తెలుగులో ప్రపంచ సాహిత్యం మీద ఎంత సమాచారం ఉంది అని తెలుగు సాహితీవేత్తలైన  కొందరు మిత్రుల వద్ద వాకబు చేశాను. ఇంగ్లీష్ లో ప్రపంచ చరిత్ర మీద ఒక సాహితీ సముద్రమే ఉంది. మచ్చుకి చెప్పాలంటే కేవలం రెండవ ప్రపంచ యుద్ధం మీదనే 24 వాల్యూముల విజ్ఞానసర్వస్వం (Encyclopedia) వుంది. అది కాక కేవలం రెండవ ప్రపంచ యుద్ధం అనే అంశం మీద వందల, వేల సంఖ్యలో పరిశోధనా పుస్తకాలు, నవళ్లు, కామిక్ లు  ఉంటాయి. అవి గాక సినిమాలు, డాక్యుమెంటరీలు, టీవీ సీరియళ్లు మొదలైనవి. కాని తెలుగులో నేను వాకబు చేసినంత మేరకు ప్రపంచ యుద్ధం మీద ఒక్క పుస్తకం కూడా ఉన్నట్టు సమాచారం లేదు.  అరకొరగా నాలుగు పుస్తకాలు తప్ప అన్ని ముఖ్యమైన అంశాల మీద, అజ్టెక్ ల నుండి అసీరియన్ల దాకా, వైకింగ్ ల నుండి విసిగోథ్ ల దాకా ప్రపంచంలో ప్రతీ జాతి గురించి, ప్రతీ నాగరికత గురించి సమగ్రంగా, సువిస్తారంగా రాయబడ్డ సాహిత్యం తెలుగులో లేదనే చెప్పాలి.

ఈ వెలితి తెలుగులో మాత్రమే వుందా, తక్కిన భారతీయ భాషల గతి కూడా ఇలాగే వుందా అన్న ప్రశ్నకి నా వద్ద జవాబు లేదు. ఏదేమైనా ఈ వెలితి సహించరాని వెలితి. తెలుగు ప్రాచీనమైన భాషా కాదా అన్న ప్రశ్న నా ఉద్దేశంలో అంత ముఖ్యమైన ప్రశ్న కాదు. కాని తెలుగు మంచి భవిష్యత్తు గల భాషా కాదా అన్నది తేలవలసిన అసలు ప్రశ్న. ఏ భాషైనా మంచి భవిష్యత్తు ఉండాలంటే  అందులో విస్తారంగా సమాచారం, విజ్ఞానం ఉండాలి. ఈ సందర్భంలో ప్రపంచ చరిత్ర గురించిన సాహిత్యం విస్తారంగా ఉండాలి అనిపిస్తుంది.

అలా ఆలోచిస్తుంటే నా మనసులో ఒక ఆలోచన మెదిలింది. ఆలోచన కన్నా దాన్ని కల అనాలేమో. చరిత్ర బాగా తెలిసిన వాళ్లు ఓ పది మంది కలిసి తలా ఒక ప్రాంతాన్ని తిసుకుని మనకి తెలిసినంత మేరకు, మానవ నాగరికత ఆవిర్భవించిన తరుణం నుండి  నేటి వరకు ప్రపంచ చరిత్ర ని విపులంగా 10,000  పేజీల పరిమాణంలో అనేక సంపుటాలుగా తెలుగులో రాస్తే ఎంత ఘనంగా ఉంటుంది! తెలుగు సాహిత్యం మీద అలాంటి పరిణామం గాఢమైన ముద్ర వేస్తుంది. అలాంటి చారిత్రక సాహిత్యం ఎన్నో ఇతర రంగాల్లో గొప్ప సృజనకి హేతువు కాగలదు. చరిత్ర నుండి స్ఫూర్తి తీసుకుని, చారిత్రక ఘట్టాలని నమూనాలుగా చేసుకుని, కుప్పలు తెప్పలుగా నవళ్ళు, కథలు, నాటకాలు, సినిమాలు, టీవీ సీరియళ్లు పుట్టుకొస్తాయని పిస్తుంది.

ఇటీవలి కాలంలో అలాంటి నిదర్శనాలు లేకపోలేదు. స్టార్ వార్స్ కథలకి స్ఫూర్తి జపనీస్ సమూరాయ్ ల గాధలేనని అంటాడు ఆ సినిమాల సృష్టికర్త, హాలీవుడ్ డైరెక్టర్ జార్జ్ లూకాస్. ప్రఖ్యాత సైన్స్ ఫిక్షన్ రచయిత ఐసాక్ అసిమోవ్ ‘Foundation’ అనే పేరు మీద ఆరు సంపుటాలు గల నవలా మాలిక రాశాడు. అందులో కొన్ని వేల సంవత్సరాలు భవిష్యత్తులో మానవజాతి మొత్తం పాలపుంత గెలాక్సీ అంతటా వ్యాపించి ఒక విశాల విశ్వసామ్రాజ్యాన్ని స్థాపించినట్టు ఊహించి రాస్తాడు. విస్మయం కలిగించే అలాంటి ఊహాగానానికి స్ఫూర్తి  బ్రిటిష్ రచయిత ఎడ్వర్డ్ గిబన్ రాసిన రోమన్ చరిత్ర నుండీ వచ్చిందంటారు వ్యాఖ్యాతలు.   ఇటీవల బాగా విజయవంతం అయిన గేమ్ ఆఫ్ త్రోన్స్ అనే టీవీ సీరియల్ కి స్ఫూర్తి రోమన్, బ్రిటిష్ చరిత్రల నుండి వచ్చిందని పరిశీలకులు అంటారు.

ఈ నేపథ్యంలో ప్రపంచ చరిత్రలో ఏదైనా ఒక అంశం మీద రాయాలని సంకల్పించాను. ప్రపంచ చరిత్ర మీద చేతికి అందిన సాహిత్యాన్ని చదవడం మొదలెట్టాను. ఇంటర్నెట్ వ్యాసాలు చదివాను.  డాక్యుమెంటరీలు చూశాను. అలా కొంత సమాచారం సేకరించిన తరువాత రోమన్ చరిత్రతో ఈ ప్రయత్నాన్ని మొదలెట్టాలని నిశ్చయించుకున్నాను.

Tuesday, December 3, 2019

గణతంత్రం నుండి మళ్లీ నియంతృత్వం దిశగా...



ఇలా ఉండగా రోమ్ కి ఉత్తర సరిహద్దుల వద్ద హఠాత్తుగా ఓ కొత్త సమస్య వచ్చిపడింది. కింబ్రీ, టాయ్టోన్ తెగలు రోమ్ ఉత్తర సరిహద్దుల మీద దాడి చేశాయి. ఈ సారి కేటలస్ అనే కాన్సల్ సర్వసైన్యాధ్యక్షుడిగా సేనలని అదిలించాడు. ఆ యుద్ధంలో కూడా సల్లా పాల్గొని ప్రధాన పాత్ర పోషించాడు. ఈ సారి కూడా రోమ్ జయించింది.

ఈ సైనిక విజయపరంపరతో ఆత్మవిశ్వాసం పెరిగిన సల్లా రాజకీయంగా మరింత ఎత్తుకు వెళ్లాలని అనుకున్నాడు.  రోమన్ పాలనా వ్యవస్థలో అత్యున్నత పదవి కాన్సల్ అయితే, దానికి ఒక మెట్టు కిందుగా ప్రేటర్ అనే ప్రధాన న్యాయవాది పదవి ఒకటి ఉంది. తన సైనిక విజయాల గురించి ముమ్మరంగా ప్రచారం చేసి, సల్లా ఆ ప్రేటర్ పదవికి ఎన్నిక అయ్యాడు.

పెరుగుతున్న సల్లా పరపతి చూసి మారియస్ కి కన్నుకుట్టింది. సల్లాని సకాలంలో అదుపు చెయ్యకపోతే రోమ్ కే ముప్పు అని మారియస్ గుర్తించాడు. ఇద్దరి చుట్టూ ఎంతో మంది అనుయాయులు చేరారు. ఇరు వర్గాల చుట్టూ అడపా దపా ఘర్షణ జరిగేది.
మారియస్ తో కలహాన్ని ఓ కొత్త ఎత్తుకు తీసుకువెళ్లాలని సంకల్పించాడు సల్లా.

అప్పుడే రోమన్ చరిత్రలో ఎన్నడూ జరగని ఓ దుడుకు చర్యకి ఒడిగట్టాడు సల్లా.  తన కింద ఉన్న సైన్యాన్ని, కంచే చేను మేసిందనే నానుడిని తలపించేలా, రోమ్ నగరం మీదకి ఉసికొల్పాడు. సైనిక బలంతో నగరాన్ని, సెనేట్ ని ఆక్రమిస్తే ఇక తన అధికారాన్ని ధిక్కరించేవారు ఉండరు. ఆ దాడిని మారియస్ బలగం అడ్డుకోవాలని చూసింది కాని విఫలమయ్యింది. మారియస్  రోమ్ నుండి పారిపోయి ప్రాణాలు కాపాడుకున్నాడు.

సల్లా, మారియస్ మధ్య నడిచిన చిరకాల శత్రుత్వానికి క్రీ.పూ. 84 లో మారియస్ మరణంతో తెరపడింది.  ఇక తనకి ఎదురులేదని గుర్తించిన సల్లా క్రీ.పూ. 83 లో రోమ్ మీద మరొక్కసారి దండయాత్ర ప్రకటించాడు. సెనేట్ సభ్యులు, తదితర ప్రభుత్వ ఉద్యోగులు ఒక్కొరొక్కరే తనకి దాసోహం అన్నారు. కాదన్న వారి ప్రాణాలు తీశాడు. సెనేట్ నిండా తన పక్షం వారినే స్థాపించాడు. తన కిరాతకాలు మరింత వికృత రూపాలు కూడా దాల్చాయి. తనకి వ్యతిరేకంగా మొత్తం సామ్రాజ్యంలో ఎవరైనా మాట్లాడారని తెలిస్తే, వారిని సమాజ శత్రువులుగా ముద్రవేయించేవాడు. వాడి తల తీసి తెస్తే పెద్ద బహుమానం ఉంటుందని ప్రకటించాడు. పౌరులకి భయం పుట్టేలా క్షతగాత్రుల తలలని రోమ్ పురవీధుల్లో బహిరంగంగా వేలాడ దీయించేవాడు.

 ఇలా క్రమంగా, అక్రమంగా సర్వాధికారాలు తన గుప్పెట్లో పెట్టుకుని నియంతలా ప్రవర్తించాడు సల్లా. రోమన్ రాజ్యాంగంలో అత్యవసర పరిస్థితుల్లో నియంతని ఎన్నుకునే వీలు ఉంది. (లోగడ సిన్సినాటీని ఎన్నుకున్న ఘట్టం గురించి చెప్పుకున్నాం).  కాని ఆ పదవి కేవలం ఆరునెలలకే వర్తిస్తుంది. ఆ తరువాత అతడు గద్దె దిగి, మునుపటి గణతంత్ర యంత్రాంగానికి చోటివ్వాలి.  కాని ఈ సారి సల్లా రోమన్ సామ్రాజ్యానికి నిరవధికంగా తానే నియంతగా, సర్వసామ్రాట్టుగా ప్రకటించుకున్నాడు.

రాజులకి సర్వాధికారాలు ఇస్తే పాలన ఎంత కిరాతకంగా ఉంటుందో ఏనాడో చవిచూసిన రోమన్ పౌరులు రాచరికానికి స్వస్తి చెప్పి, గణతంత్రాన్ని ఎంచుకున్నారు. అయితే కొన్ని శతాబ్దాల తరువాత వెనకటి పీడ మళ్లీ వాళ్ల తలకి చుట్టుకుంది. అధికార మదంతో విర్రవీగే ఓ దుష్టుడు ఇప్పుడు వారి నెత్తిన కూర్చున్నాడు.

సల్లా ప్రభావం వల్ల రోమన్ పాలక వ్యవస్థ క్రమంగా గణతంత్రం నుండి నియంతృత్వం దిశగా మళ్లింది. రోమన్  చారిత్రక పరిణామ పథంలో ఆ మలుపు శాశ్వతంగా  నిలిచిపోతుంది. అయితే నియంతలంతా దుష్టులు కానక్కర్లేదు. ప్రజలంటే సహజమైన అభిమానం కలిగి, పాలనా వ్యవహారాలలో దక్షుడై, సైనిక వ్యవహారాలలో అసమానశూరుడైన చక్రవర్తి రాజ్యం చేస్తే, ప్రజలు సుఖసంతోషాలతో జీవించే అవకాశం లేకపోలేదు. అలాంటి చక్రవర్తుల పరంపర ఒకటి ఇప్పటి నుండి ఒకటి రెండు శతాబ్దాల పాటు రోమన్  సామ్రాజ్యాన్ని పాలించనుంది. వారి ఏలికలో రోమన్ సామ్రాజ్యం అసలు చరిత్రలోనే అసమానమైన, అపూర్వమైన ఉన్నతిని చేరుకుంటుంది. అలాంటి చక్రవర్తులలో ప్రథముడు, రోమన్ చరిత్రలో శాశ్వత స్థానాన్ని పొందినవాడు, ఆ తరువాత రెండు సహస్రాబ్దాల పాటు రాజులకి, రాజవంశాలకి స్ఫూర్తిగా నిలిచినవాడు ఒకడు ఉన్నాడు. అతడి పేరు జూలియస్ సీజర్.

 (ఇంకా వుంది)

Sunday, November 24, 2019

సైనిక సంస్కరణలు చేపట్టిన మారియస్



మారియస్ కృషి వల్ల రోమన్ సైన్యం మళ్లీ పెరిగింది. అట్టడుగు వర్గాలకి చెందిన వారిని సైన్యంలో చేర్చుకోవడమే కాక,  వారికి సొంత భూములు ముట్టజెప్పే ఏర్పాట్లు కూడా చేశాడు. సేనలు  ఓ కొత్త రాజ్యాన్ని జయించినప్పుడు ఆ రాజ్యంలో కొంత భూమిని దాన్ని జయించిన సిపాయిలకి అందేలా విధివిధానాలు రూపొందించాడు. “ఈ రాజ్యాన్ని జయిస్తే నాకేంటి?” అని సిపాయిలు తమని తాము వేసుకునే ప్రశ్నకి ఇప్పుడు సమాధానం దొరికింది. భూమితో పాటు అంతో ఇంతో పారితోషకం కూడా దక్కేది. సకాలంలో జీతభత్యాలు అందజేయడమే కాకుండా, ఉద్యోగ విరమణ చేశాక పింఛను వచ్చే ఏర్పాట్లు కూడా చేశాడు. ఇలాంటి సంస్కరణల వల్ల సైనిక వృత్తి ఒక ప్రత్యేకమైన, గౌరవప్రదమైన వృత్తిగా ఎదిగింది.

మారియస్ చేపట్టిన ఈ సైనిక సంస్కరణల పర్యవసానం కేవలం పేదవారికి ఉద్యోగావకాశాలు కల్పించడంతో ఆగిపోలేదు. దాని వల్ల అసలు రోమన్ సమాజంలోనే ప్రగాఢమైన విప్లవం బయల్దేరింది.
గయస్ మారియస్ (తైలవర్ణ చిత్రం - కళాకారుడు జాన్ వాండర్లిన్)









ఈ కొత్త సైనిక వ్యవస్థలో, సిపాయిలకి కొత్త వరాలన్నీ ప్రసాదించేవాడు సేనాపతి. జీతాలు ఇచ్చేవాడు, కూడు, గుడ్డ, నీడ ప్రసాదించేవాడు, పింఛను మంజూరు చేసేవాడు అయిన సేనాపతి ఈ కొత్త పద్ధతిలో సైనికుల పాటి దైవంగా చలామణి అయ్యాడు. వెనకటి వ్యవస్థలో బలం అంతా సెనేట్ చేతుల్లో ఉండేది. ఈ కొత్త వ్యవస్థలో ఆ బలం యొక్క కేంద్ర స్థానం సైన్యం వైపుగా, సేనాపతుల వైపుగా మళ్లింది. ఒకప్పుడు సెనేట్ మీద సేనాపతులు ఆధారపడేవారు. ఇప్పుడు మొత్తం సైనిక బలాన్ని గుప్పెట్లో పెట్టుకున్న సేనాపతుల మీదే సెనేట్ సభ్యులు ఆధారపడవలసిన పరిస్థితి ఏర్పడింది. బలాల సమతూనికలో వచ్చిన ఈ కొత్త మార్పు వల్ల రోమన్ పాలనా వ్యవస్థలో ప్రగాఢమైన మార్పులు చోటుచేసుకున్నాయి.

రోమన్ పాలనా వ్యవస్థ యొక్క బలకేంద్రాన్ని సెనేట్ నుండి సైనిక దళాల వైపుగా మళ్లించే ఒరవడికి నాంది పాడినవాడు సేనాపతి గయస్ మారియస్ అయితే, ఆ ఒరవడికి ఎంత భయంకరమైన పర్యవసానాలు ఉంటాయో ప్రదర్శించి చూపించిన మరో సేనాపతి ఉన్నాడు. అతడి పేరు లూసియస్ కోర్నీలియస్ సల్లా.

క్రీ.పూ. 138 లో ఒక నిరుపేద కుటుంబంలో పుట్టిన సల్లా, యవ్వనంలో సైనిక దళంలో చేరాడు. ధైర్యపరాక్రమాలు గలవాడు కావడంతో వేగంగా సైనికదళంలో ఎదిగి మారియస్ యొక్క ఉపసేనాపతులలో ఒకడయ్యాడు.

క్రీ.పూ. 112–106  దరిదాపుల్లో రోమ్ కి ఉత్తర ఆఫ్రికా తీరప్రాంతమైన నుమీడియా రాజ్యాన్ని పాలించే జుగర్తా అనే రాజుతో వైరం ఉండేది.  ఆ కాలంలో సేనాపతిగా ఉన్న గయస్ మారియస్ కి జుగర్తాకి మధ్య జరిగిన యుద్ధాలలో సల్లా ముఖ్యపాత్ర పోషించాడు. నుమీడియా కి పొరుగురాజ్యమైన మారిటానియా ని ఆ కాలంలో బోకస్ అనే రాజు పాలించేవాడు. బోకస్ సహాయపడితో జుగర్తాని వశం చేసుకోవడం సులభం అని సల్లా గుర్తించాడు. ఒడుపుగా దౌత్యం నడిపి రోమ్ పట్ల కొద్దోగొప్పో సుముఖత గల బోకస్ రాజుని తమ వైపుకి తిప్పుకున్నాడు. బోకస్ ప్రమేయం వల్ల జుగర్తాని వశం చేసుకోవడానికి వీలయ్యింది. ఆ విధంగా జుగర్తా మీద యుద్ధంలో విజయం రోమ్ ని వరించింది.

యుద్ధం గెలిచిన ఘనత అంతా తనదేనని సల్లా రోమ్ లో చాటుకోవడం మొదలెట్టాడు. దాంతో ఒళ్లు మండిన మారియస్ తన ప్రియతమ ఉపసేనాపతికి తగిన శాస్తి చెయ్యాలనుకున్నాడు. ఆ అదను కోసం ఎదురుచూడసాగాడు.


(ఇంకా వుంది)

Wednesday, November 20, 2019

3. గణతంత్రం నుండి సామ్రాజ్యవాదానికి


3. గణతంత్రం నుండి సామ్రాజ్యవాదానికి

ఎడతెరిపిలేని యుద్ధాలతో రోమన్ సామ్రాజ్యం గణనీయంగా విస్తరించింది. ప్యూనిక్ యుద్ధాల తరువాత రోమన్ సామ్రాజ్య విస్తీర్ణత 650,000 చదరపు కిమీలు ఉండేదని అంతకు ముందు చెప్పుకున్నాం. కాని ఆ విజయ పరంపర సాధించడం కోసం రోమన్ సమాజం పెద్ద జరిమానాయే చెల్లించింది. యుద్ధాలకి అయిన ఖర్చు వల్ల ఖజానా అడుగంటిన పరిస్థితి ఏర్పడింది. ఆర్థికంగానే కాక మానవ వనరుల దృష్ట్యా కూడా రోమ్ ఎంతో కోల్పోయింది. రోమ్ తలపెట్టిన యుద్ధాలు ఆరోగ్యవంతులైన రోమన్ యువకులని లక్షల సంఖ్యలో పొట్టన పెట్టుకుంది. ఏళ్ల తరబడి దూర ప్రాంతాలలో యుద్ధాలు చెయ్యవలసి రావడం వల్ల సిపాయిలకి వారి కుటుంబాలకి మధ్య బాంధవ్యం ఎన్నో సందర్భాలలో తెగతెంపులు అయ్యే పరిస్థితి వచ్చింది. యుద్ధాలతో బతికి బట్టకట్టిన వారిలో ఎంతో మంది చితికిన శరీరాలతో తమ స్వగ్రామాలని చేరుకుని దుర్భరమైన బతుకులు కొనసాగించారు.
ఇలాంటి సైన్యంతో నిరవధిక రోమన్ సామ్రాజ్య విస్తరణ  సాధ్యం కాదని, అందుకు తగురీతిలో సైనిక సంస్కరణలు చేపట్టవలసిన అవసరం వుందని గుర్తించిన ఒక వ్యక్తి ఉన్నాడు. అతడి పేరు గయస్ మారియస్. రోమన్ ప్రభుత్వంలో మారియస్ రకరకాల హోదాలలో పని చేశాడు. ఏడు సార్లు రోమన్ పాలనా వ్యవస్థలో అత్యున్నత పదవి అయిన కాన్సల్ పదవిని పోషించాడు. సేనాని గాను, రాజకీయ నాయకుడి గాను కూడా పని చేశాడు.

రోమన్ సైనిక వ్యవహారాలలో అతడు కొన్ని లోతైన లొసుగులు గమనించాడు. రోమన్ సైన్యంలో సైనికుల నియామకం అయ్యే తీరు ప్రత్యేకంగా ఉండేది. ఆధునిక దేశాలలో సైనిక ఉద్యోగం ఒక ప్రత్యేకమైన వృత్తి. అందుకు తగ్గ అర్హతలు గల యువతీ యువకులు ఆ ఉద్యోగంలో చేరి, ఆ వృత్తికి సంబంచిన బాధ్యతలనే అనితరంగా నిర్వర్తిస్తారు.

కాని రోమన్ సైన్యంలో పరిస్థితి వేరు. రోమన్ సమాజంలో పౌరులు వారి ఆదాయాన్ని బట్టి ఆరు తరగతులుగా వర్గీకరించబడేవారు. అధిక ఆదాయం గల వారు ఉన్నత తరగతులలోను, తక్కువ ఆదాయం గల వారు కింది తరగతులలోను ఉండేవారు. అన్నిటికన్నా తక్కువ తరగతికి, అంటే ఆరవ తరగతికి, చెందిన వారు సొంతభూములు లేని నిరుపేదలు. వీరిని ప్రోలిటరీ (proliterii) అంటారు. వీరికి పెద్దగా హక్కులు ఉండవు.

సైన్యంలో చేరాలంటే పై ఐదు తరగతులకి చెందిన వారు అయ్యుండాలి. పైగా వారి ఆయుధాలు వారు తెచ్చుకోవాలి. యుద్ధ కాలానికి కొంచెం ముందుగా సేనలని పోగు చేసి ఆదరాబాదరాగా వారికి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. యుద్ధ కాలంలో మాత్రం, సైనిక సిబిరాలలో వారి దైనిక జమఖర్చులు ప్రభుత్వం భరిస్తుంది. యుద్ధం ముగిశాక వారి వారి మునుపటి వృత్తులలో తిరిగి చేరిపోతారు. ఇలాంటి ఏర్పాటులో సైనికుల అసలు వృత్తి పోరాటం కాదు. సైనిక వృత్తి అనేది సామాన్య పౌరులు ఆపత్సమయంలో చేపట్టే ఒక వ్యాపకం మాత్రమే.

సైనిక వృత్తిని తాత్కాలికంగా, ఒక వ్యాపకంలా చేపడితే అలాంటి సైనికుల సామర్థ్యం అంతంత మాత్రంగానే ఉంటుందని మారియస్ త్వరలోనే గుర్తించాడు. ఇక్కడే అతడు ఓ అద్భుతమైన నిర్ణయం తీసుకున్నాడు. సొంత భూములు లేక, రోజు కూలి కోసం ఇబ్బంది పడే నిరుపేద వర్గమైన ప్రోలిటరీని చేరదీసి వారిని సైన్యంలో తీసుకుంటే, వారి నిరుద్యోగ సమస్యని తీర్చినట్టు అవుతుంది. అంతేకాక కచ్చితమైన ఉద్యోగం లేని ఆ వర్గపు మనుషులని, అనితరంగా సైనిక శిక్షణ నిస్తే వారింత మరింత సమర్థులైన  యోధులుగా తీర్చిదిద్దొచ్చు. అలాంటి ఆలోచనతో గ్రామాలని గాలించి పెద్ద ఎత్తున గ్రామస్థులని, పేదలని సైన్యంలో చేర్చుకోవడం మొదలెట్టాడు.

“చూడు తమ్ముడూ! నీ పేరేంటి?”
“లోరెన్జో దొరా!”
“ఏం పని చేస్తావు?”
“ద్రాక్షతోటల్లో పని చేస్తా దొరా.”
“సైన్యంలో చేరతావా?”
“చదువు రానోణ్ణి. అవన్నీ నాకేటి తెలుస్తాయి దొరా?”
“చదువు అక్కర్లేదు. కండబలం, గుండె ధైర్యం ఉంటే చాలు. కావలసిన చదువు నేను చెప్పిస్తాగా.  ఏదీ ఈ శూలం ఓ సారి విసిరి చూపించు.”

(ఇంక వుంది)


Wednesday, November 6, 2019

అసువులు బాసిన హానిబల్ - మూడవ ప్యూనిక్ యుద్ధం


ఇరు పక్షాల మధ్య పోరు మొదలయ్యింది. ఆది నుండి సంగ్రామలక్ష్మి హానిబల్ పక్షాన్నే వరించింది. మొదట ట్రేబియా యుద్ధంలో, తరువాత ట్రాసిమీన్ చెరువు యుద్ధంలో, చివరిగా క్రీ.పూ. 216 లో కానై యుద్ధంలో రోమన్ లిజియన్లని మట్టి కరిపించాడు హానిబల్. రోమన్ సైన్యంలో 50,000 లో సిపాయిలు  మంది నేలరాలారు. హానిబల్ సైన్యం వల్ల రోమన్ సామ్యాజ్య అస్తిత్వానికే ముప్పని రోమ్ ఇప్పుడు స్పష్టంగా తెలిసింది.

ఇటాలియన్ ద్వీకలల్పం అంతటా ఎన్నో చోట్ల హానిబల్ సేనలు రోమన్ సేనలతో కత్తులు కలిపాయి. ఇంచుమించు ప్రతీ సారి గెలుపు హానిబల్ దే అయ్యింది. ఈ యుద్ధాలు పదిహేనేళ్ల పాటు కొనసాగాయి. ఇటాలియన్ ద్వీకల్పపు  దక్షిణ ప్రాంతంలో చాలా భాగం హానిబల్ చేతికిందికి వచ్చింది. కాని రోమన్ నగరం మాత్రం ఇంకా అతడి వశం కాలేదు. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. రోమ్ నగరాన్ని కాపాడే ప్రాకారాలు శత్రుదుర్భేధ్యమైన గోడలు. వాటిని భేదించడానికి కావలసిన ప్రత్యేక యంత్రాంగం హానిబల్ కి లేకపోయింది. పైగా దీర్ఘకాలపు పోరాటాల వల్ల ఒక పక్క అతడి సేనలు తరిగిపోతూ వస్తున్నాయు. దూరాభారం వల్ల స్వరాజ్యమైన కార్తేజ్ నుండి అదనపు బలగాలు రావడానికి కష్టమవుతోంది. సేనల పోషణకి కావలసిన ఆహారం కోసం ఇటలీలో రైతులని అటకాయించి, వారి పంటల మీదపడి దోచుకునేవారు హానిబల్ సైనికులు. కొంత ఆహారం ఆఫ్రీకా నుండి వచ్చేది. దూరం నుండి వచ్చా ఆహార సరఫరా మీద ఆధారపడే హానిబల్ సైనికుల బలహీనత రోమన్లకి అర్థమయ్యింది. ఆహారసరఫరా ఎక్కడి నుండి వస్తోందో ఆ మూలాల మీద దెబ్బ కొట్టాలి.

ఈ సందర్భంలో రోమన్  సెనేట్ ఓ ఉద్దండుడైన సేనానిని, హానిబల్ కి సమవుజ్జీ వంటి వాణ్ణి ఎంచుకుంది. అతడి పేరు పుబ్లియస్ కొర్నీలియస్ స్కిపియో. లోగడ కానై యుద్ధంలో హానిబల్ సేనలతో తలపడ్డ వాడు ఇతడు. హానిబల్ యుద్ధ వ్యూహాలు క్షుణ్ణంగా చదివినవాడు. ముప్పై నాలుగు వేల మంది సైన్యంతో ఆఫ్రికా పయనమయ్యాడు స్కిపియో. కార్తేజ్ రాజ్యానికి ఆయువుపట్టు అయిన కార్తేజ్ నగరాన్ని అటకాయించాడు. రాజధాని నాశనమవుతున్న తరుణంలో ఇక విధిలేక హానిబల్ కి ఇటలీలో పోరాటాలు నిలిపి స్వదేశానికి వెళ్లక తప్పలేదు. ఇరుసేనలు ఆధునిక టునీషియాలో జామా అనే ఊరి వద్ద యుద్ధానికి దిగాయి.  చివరికి క్రీ.పూ. 202 లో ఆ యుద్ధంలో రోమన్ సేనల చేతుల్లో హానిబల్ సేనలు ఘోరపరాజయాన్ని పొందాయి.

శాతాబ్దాల చరిత గల కార్తేజ్ సామ్యాజ్యం ఇప్పుడు నేలకి ఒరిగింది. హానిబల్ యుద్ధ భూమి నుండి పారిపోయి గ్రీస్ లో తలదాచుకున్నాడు. అప్పటికే వయసు పైబడ్డ ఆ మహాసేనాని ఎడతెగని  యుద్ధాలతో బాగా చితికిపోయాడు. పోయినవాణ్ణి పోనివ్వక రోమన్ సైనికులు అతణ్ణి గాలిస్తూ గ్రీస్ కి వెళ్లాయి. ప్రాణం పోయినా ఫరవాలేదు గాని రోమన్లకి చేతికి చిక్కకూడదని అనుకున్న హానిబల్ విషం మింగి ఆత్మత్యాగం చేసుకున్నాడు.




మూడవ ప్యూనిక్ యుద్ధం

రెండవ ప్యూనిక్ యుద్ధం తరువాత, హానిబల్ మరణం తరువాత కార్తేజ్ బాగా చితికిపోయింది. సైనిక బలం కూడా బాగా క్షీణించిపోయింది. కార్తేజ్ బలంగా ఉన్న రోజుల్లో కిక్కురు మనని ఇరుగుపొరుగు రాజ్యాలు ఇప్పుడు కార్తేజ్ బలహీనత చూసి  తోకజాడించడం మొదలెట్టాయి. పొరుగు రాజ్యమైన నుమీడియాకి, కార్తేజ్ కి మధ్య సరిహద్దుల్లో పదే పదే ఏదో చిచ్చు రేగుతూ ఉండేది. రోమ్ చేతి కింద సామంత రాజ్యంగా ఉండే నుమీడియా, రోమ్ అండ చూసుకుని పేట్రేగిపోయేది. ఇరు రాజ్యాల మధ్య వివాదం తలెత్తితే, తగుదునమ్మా రోమ్ అందులో తలదూర్చి తగవు తీర్చేది. తీర్పు ఎప్పుడూ నుమీడియాకే సానుకూలంగా ఉండేది.
ఉత్తర ఆఫ్రికాలో నుమీడియా


తమ పట్ల రోమ్ చూపిస్తున్న పక్షపాత వైఖరి  కార్తేజ్ ప్రజల్లో   రోమ్ పట్ల ద్వేషభావాన్ని పెంచింది. రెండవ ప్యూనిక్ యుద్ధం జరిగిన యాభై ఏళ్లకి కార్తిజీనియన్లు (కార్తేజ్ ప్రజలు) రోమ్ కి యుద్ధ పరిహారం కింద చెల్లించాల్సిన రుసుం పూర్తిగా చెల్లించేశారు. ఇక రోమ్ కి తమకి మధ్య లావాదేవీలేవీ లేవని, రోమ్ నుండి తమకి పూర్తిగా ఇన్నేళ్లకి స్వతంత్రం లభించిందని కార్తేజ్ వాసులు గుండెల నిండా ఊపిరి పీల్చుకున్నారు.

రోమ్ పీడ విరగడయ్యిందని తెలిశాక వాళ్లు మొట్టమొదట సాధించగోరినది నుమీడియా సమస్యని తేల్చుకోవడం. కార్తేజ్ నుమీడియా మీద దండయాత్ర చేసింది. కాని సైనిక బలం సరిపోక ఆ యుద్ధంలో ఓడిపోయింది. పైగా ఉన్న కాస్తంత సంపద కూడా యుద్ధం వల్ల తరిగిపోవడం వల్ల పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది.

కార్తేజ్ కొత్తగా ప్రదర్శిస్తున్న ఈ యుద్ధోత్సాహం రోమన్ సెనేట్ లో కలకలం కలిగించింది. కార్తేజ్ మళ్లీ బలగాలని పోగు చేసుకోకుండా ఈ సారి సమూల నాశనం చెయ్యాలన్న కాంక్ష రోమన్ సెనేట్ లో బలవత్తరం కాసాగింది. కేర్తేజ్ ని ముగ్గులోకి దింపడానికి ఏదో ఒక విధంగా రెచ్చగొట్టే ప్రయాత్నాలు మొదలెట్టింది రోమ్. కార్తేజ్ మీద సహించరాని అంక్షలు విధించే ప్రయత్నం చేసింది.  అలాంటి ఆంక్షల్లో ఒకటి కార్తేజ్ నగరాన్ని స్థానభ్రంశం చెయ్యడం. ఆ నగరం మొత్తం నేలమట్టం చేసి, ఆఫ్రికా తీరం నుండి దూరంగా మరో చోట నిర్మించాలన్నది రోమ్ కోరిక. కార్తేజ్ దాన్ని త్రోసిపుచ్చింది.

రోమ్ విన్నపాన్ని త్రోసిపుచ్చిందన్న నెపాన, క్రీ.పూ. 149 లో రోమ్ కార్తేజ్  మీద మరో సారి దాడి చేసింది. అదే మూడవ ప్యూనిక్ యుద్ధం అయ్యింది. కార్తేజ్ ఈ సారి ఆత్మరక్షణ కోసం కేవలం సైనిక బలగాల మీదే ఆధారపడితే సరిపోదని తెలుసుకుంది. నగరంలో సామాన్య పౌరులు కూడా అనేకరకాలుగా ఆ ఆఖరి పోరాటంలో పాల్గొన్నారు. వింటినారి కోసం నారీ శిరోజాలని వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మూడేళ్లపాటు జరిగిన ఆ కార్తేజ్ నగర ముట్టడికి అంతంలో క్రీ.పూ. 146లో కార్తేజ్ నగరం రోమన్ సేనల వశమయ్యింది. కార్తిజీనియన్ల మీద చిరకాల కక్ష తీర్చుకునే అదను దొరికింది. రోమన్ సేనలు ఆ మహానగరాన్ని ఇంచుమించు భూస్థాపితం చేశారు. నగర వాసులని ఊచకోత కోశారు. ఆ దారుణమారణ కాండలో సుమారు ఐదు లక్షల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారని అంచనా. బతికి బట్టకట్టిన 50,000 మంది బానిసత్వానికి బలయ్యారు. కార్తేజ్ రాజ్యం మొత్తం రోమన్ సామ్రాజ్యంలో విలీనమై ‘రోమన్ సామ్రాజ్యంలో ఆఫ్రికా భాగం’గా కొత్త పేరు తెచ్చుకుంది.

రోమన్ సామ్రాజ్యపు టెల్లలు ఇప్పుడు అమాంతంగా విస్తరించాయి. ఆఫ్రికా ఖండంలో ఉత్తర తీర ప్రాంతాలెన్నో ఇప్పుడు రోమన్ సామ్రాజ్యంలో కలిశాయి. యూరప్ లోనే పశ్చిమాన ఆధునిక స్పెయిన్ లో ఒక భాగమైన ఐబీరియా కూడా కలిసింది. ఫ్రాన్స్ లో దక్షిణ భాగాలు కూడా రోమన్ ప్రాంతాలయ్యాయి. ఇక మానవ పాదం ఆకారంలో ఉండే ఇటాలియన్ ద్వీపకల్పం మొత్తం ఎప్పుడో రోమన్ హయాం లోనికి వచ్చింది. రోమన్ ప్రభావం   తూర్పు దిశలో కూడా విస్తరించింది. మొత్తం రోమన్ సామ్రాజ్య విస్తీర్ణత ఆ దశలో సుమారు 650,000 చదరపు కిమీలు ఉండేదని అని చారిత్రకుల అంచనా. అంటే ఇంచుమించు దక్షిణ భారత భూభగపు విస్తీరణతతో సమానం అన్నమాట.

అయితే రోమన్ సామ్రాజ్య విస్తరణ ఇంకా పూర్తి కాలేదు. మరో రెండు శాతాబ్దాల తరువాత, రోమన్ సామ్రాజ్యం మహర్దశను చేరుకున్న తరుణంలో, దాని విస్తీర్ణత ప్యూనిక్ యుద్ధాల అంతంలో ఉన్న విస్తీర్ణతతో పోల్చితే సుమారు పది రెట్లు పెరుగుతుంది. అయితే రాజ్యపు పొలిమేరలని అంత మేరకు విస్తరింపజేయాలంటే సైనిక నిర్వహణలో కొన్ని ముఖ్యమైన సంస్థాగత సంస్కరణలు జరగాలి.  ఆ సంస్కరణల వల్ల రోమన్ పాలనా వ్యవస్థలో ప్రగాఢమైన మార్పు వచ్చింది.

 (ఇంకా వుంది)







(ఇంకా వుంది)